
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నడు లేనంతగా ఫ్యాన్ వార్లు, నకిలీ పోస్టులు, మార్ఫ్ చేసిన ఫోటోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ట్రోలర్స్ మరింత దిగజారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వివాదానికి టార్గెట్ గా మారింది యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయనపై అసభ్యకరంగా మార్చిన ఫొటోలు, పోస్టులు షేర్ అవుతుండటంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వేరే హీరోల ఫ్యాన్ గ్రూపులు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం, మార్ఫ్ ఫొటోలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
దాంతో సోషల్ మీడియాలో వాగ్వాదాలు, కౌంటర్ పోస్టులు మొదలయ్యాయి — “వేరే హీరోల ఫ్యాన్స్ కాదులే, ఫేక్ అకౌంట్స్ వల్లే ఈ గందరగోళం!” అని మరో వర్గం చెబుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ అభిమానులు పోలీస్ కమిషనర్ వద్ద ఫిర్యాదు చేశారు, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే ..తాజాగా ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు కొందరు పెట్టారు. అంతేకాదు ఎన్టీఆర్ గుండుతో ఉన్నట్టుగా ఎడిట్ చేసి ఫ్లెక్సీ పెట్టారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురై వారిపై చర్యలకు దిగారు.
ఈ విషయమై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్కు తాజాగా ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నందిపాటి మురళి తాజాగా సీపీ సజ్జనార్ని కలిసి పిటిషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఫోటోలు పెడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన పోస్టులు, ఫోటోలు తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ చుట్టూ రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినిమా తాత్కాలికంగా షూటింగ్ ఆగిపోయిందనే వార్తల నేపథ్యంలో కొన్ని ప్రతికూల గ్రూపులు తప్పుడు ఫోటోలు సృష్టించి, పంచుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ టీమ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, పోలీసు కమిషనర్కి ఫిర్యాదు చేసింది.
